Sunday, July 17, 2016

Birth Place of Veerashaivam Kolanupaka - 2

వీరశైవం మూలస్థానం కొలనుపాక -2

                                 రేణుకాచార్యులు కొలనుపాకలో ఉద్భవించారని తెలిపే ఆధారాలు  


వీరశైవమతమందు పూర్వకాలమున ఆచార్యులు/మఠాదిపతులు, ఆచార్యత్వం/మఠాధిపత్యం వహించిన పిదప తమ మాతాపితల వివరాలు లాంటివి చెప్పుకునేవారు కాదు, వాటి గురించి ఎవరూ అడిగేవారు కూడా కాదు. వీరిని లింగోద్భవులు అనే చెప్పేవారు, అలాగే చనిపోయినప్పుడు లింగైక్యులు అనే చెప్పేవారు (ఇప్పటికీ ఎవరైనా చనిపోతే లింగైక్యం చెందారనే మాటనే వీరశైవులు వాడతారు.  అంతేగాక చాలా గ్రామాల్లోని మఠాలకు సంబందిచిన పూర్వ పీఠాధిపతుల జనన విషయాలు ప్రస్తుతం ఉన్నవారికి తెలియకుండా ఉన్నది సత్యం).  అందుకే చాలామంది ఆచార్యులు/మఠాదిపతుల వివరాలు తెలియకుండా పోయాయి.   

రేణుకాచార్యుల వారు పంచాచార్యులలో ఒకురుగా ప్రసిద్దులు (నేటికి ఇంటర్నెట్ ప్రపంచంలో లభ్యంగా ఉన్న ఇందుకు సంబందించిన విషయాల లింక్ లను క్రింది తెలుపుతున్నాను)
1. http://www.shaivam.org/virashaivam/adv_panca.htm
2. http://en.wikipedia.org/wiki/Panchacharyas
3. http://panchapeeth.com/sri-rambhapuri-peeth.html
4. http://rambhapuripeetha.info/rich-lineage.htm
5. http://www.shrisiddhanthashikhamani.com/kannada/27-history-of-veerashaiva-shri-siddhanthashikhamani
6. http://www.divinebrahmanda.com/2012/03/rambhapuri-peeta-balehonnur-rambhapuri.html
7. http://www.muttinakantimathgurupeetha.com/index.php/history
8. http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%8A%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81%E0%B0%AA%E0%B0%BE%E0%B0%95

అలాగే ద్వాదశ ఆరాధ్యులలో ఒకరుగా కూడా రేణుకాచార్యులు ప్రసిద్దులు:
1. http://www.shaivam.org/ad-dwadasa-aradhyas.htm
2. http://www.sroutasaivasiddhanta.com/dwadasaradhyas.htm
3. http://www.srisaivamahapeetham.org/phylosophy.htm

రేణుకాచార్యుల వారు నల్గొండ జిల్లా కొలనుపాకలోని సోమేశ్వర లింగోద్భవులని చెప్పబడుతుంది. ఈ విషయాన్ని సిద్దంతశిఖామనిలోని 4వ పటలములోని శ్లోకాలు వివరిస్తాయి. 

అథ త్రిలింగ విషయే కొల్లిపాక్యభిధేపురే !
సోమేశ్వరమహాలింగాత్ ప్రాదురాసీత్ స రేణుకః !! (4-1)
ప్రదుర్భూతం తమాలోక్య శివలింగాత్ త్రిలింగజా: !
విస్మితాః ప్రాణినః సర్వే  బభూవురతి తేజసమ్ !! (4-2)

మరియు రేణుకాచార్యులు కొలనుపాక సోమేశ్వర లింగమునుండి ఉద్భవించారని స్వయంభువాగమం 9వ పటలం లో చెప్పబడింది.  ఈ 9వ పటలంలో మొత్తం అయిదుగురు పంచాచార్యుల గురించి వివరంగా తెలుపబడి ఉంది.  

శ్రీమద్రేవణ సిద్దస్య కొలిపాక పురోత్తమే!
సోమేశ్వర లింగ జనన మావాసః కదళీపురే !!  (స్వయంభువాగమం, చాప్టర్-9)

రేణుకాచార్యులు కొలనుపాక లింగోద్భవులని తెలిపిన కొన్ని గ్రంధాలు - రచయితలు (ఈ వివరాలు శివశ్రీ రవికోటి మఠం వీరభద్రయ్య గారు రచించిన "శ్రీక్షేత్ర కొలనుపాక వీరశైవ విభూతి రేవణసిద్దుడు" నుండి గ్రహించబడినవి):
రేణుకావిజయం  (ప్రథమ మంజరి-27,37 శ్లోకాలు) - సిద్దనాథ శివాచార్య - సంస్కృతం  
రేవణ సిద్దేశ్వర పురాణము - (సంధి 2, పద్యము-53) - బొమ్మరస - కన్నడము 
రేవణ సాంగత్య - (సంధి-2 పద్య-21) - చన్నబసవ  - కన్నడము
రేవణ సిద్దేశ్వర రగళె (నిరత స్థలం -57 వ పంక్తి) - మహాకవి హరీశ్వర  - కన్నడము
కవికర్ణ రసాయనం (ప్రథప సర్గ-శ్లోకం-6) - మహాకవి షడక్షర దేవ  - కన్నడము
రేణుక విజయము - (ప్రథమాశ్వాసం-పద్యము-49) - సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి - తెలుగు 
పంచబ్రహ్మొదయ భాష్యం (పుట-17) - సోసల చిక్క వీరనాధ్య  - కన్నడము
శివాధిక్య శిఖామణి (ప్రథమోపదేశమ్ - పుట-2) - సోసల రేవణారాధ్య  - కన్నడము

కాగా వీరశైవంలో ఆది రేణుకుల పిదప ఎంతోమంది రేణుక పేరున ప్రసిద్దినొందుటచే వీరశైవ సాహిత్యంలో ఎవరు ఎవరేనేది కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. అయినా ఆది రేణుకులు నల్లగొండ జిల్లాలోని కొలనుపాక లింగోద్భవులనేది అందరి సమ్మతమే. దేశ సంచారం సాగించి ధర్మ ప్రచారాన్ని ముగించిన పిదప రేణుకాచార్యుల వారు కొలనుపాక సోమేశ్వర లింగములోనే ఐక్యమొందటం జరిగింది. 


సిద్దాంత శిఖామణి వీరశైవుల పరమ ప్రామాణిక గ్రంధం (ధర్మ గ్రంధం)

సిద్దాంత శిఖామణి గ్రంధం శక్తివిశిష్టాద్వైత (వీరశైవ) సిద్దాంతాన్ని ప్రభోదిస్తుంది. ఈ గ్రంధంలో చెప్పబడిన అష్టావరణ, షట్ స్థల, పంచాచార సిద్దాంతాన్ని నేటికీ ఎంతోమంది తమ సంప్రాదాయంలో ఆచరిస్తున్నారు. ఈ గ్రంధ సిద్దాంతాన్ని పాటించేవారు భారతదేశంలో చాలాచోట్ల పలు సంప్రదాయికులుగా కనబడతారు. లింగధారణ, లింగారాదనే వీరికి ప్రాముఖ్యం.  

సిద్దాంతశిఖామణి  గ్రంథాన్ని తెలుగులిపిలో శ్రీశైల జగద్గురుపీఠం వారు ప్రచురించారు. అలాగే శ్రీ S.P.బాలసుబ్రహ్మణ్యం గారి స్వరంలో ఆడియో కేసెట్ రూపంలో కూడా తెలుగులో తీసుకువచ్చారు శ్రీశైల జగద్గురువులు. 

తెనాలి సాధనా గ్రంథమండలి వారు మంచి తెలుగు వివరణతో 1960లో  ప్రచురించటం జరిగింది. 

శ్రీ కాశీ జగద్గురు పీఠం వారు తెలుగు వివరణతో 2012లో ప్రచురించటం జరిగింది. ఈ గ్రంధమే తెలుగులో ఇప్పుడు లభ్యంగా ఉన్న గ్రంధం. 


సిద్దాంతశిఖామణి గ్రంధానికి సంబందించిన కొన్ని  లింక్స్ :
1. http://www.shrisiddhanthashikhamani.com/
2. http://en.wikipedia.org/wiki/Siddhanta_Shikhamani
3. http://siddhantashikhamani.blogspot.in/2011/02/siddhanta-shikhamani.html
4. http://www.kamakotimandali.com/blog/index.php?p=406&more=1&c=1&tb=1&pb=1

సిద్దాంతశిఖామణి గ్రంధకాలం ఖచ్చితంగా తెలియలేకున్నది. అయితే సిద్దాంతశిఖామణిని తన శ్రీకర భాష్యములో ప్రస్తుతించిన శ్రీపతి పండితుడు క్రీ.శ.960 ల ప్రాంతం వాడని తెలియబడుతున్నందున అంతకు మునుపుననే సిద్దాంతశిఖామణి రాయబడిందని, రేణుకులు కూడా అంతకు పూర్వులే అని తెలియవస్తుంది.

శ్రీకరభాష్య కర్త అయిన శ్రీపతి పండితుడు క్రీ.శ.900 ప్రాంతం వాడని, క్రీ.శ.980 ప్రాంతానికి చెందిన "కుసుమాంజలి" గ్రంధంలో ఉదయనుడు శ్రీపతి పండితుని విమర్శించటం జరిగిందని  డా.సర్వేపల్లి రాధాకృష్ణ గారు తమ "ఇండియన్ ఫిలాసఫీ" అనే గ్రంథంలో తెలిపారు.

శ్రీ నిడదవోలు వెంకటరావు గారు తమ "తెలుగు కవుల చరిత్ర" లో శ్రీపతి పండితుడు క్రీ.శ. 930 ప్రాంతం వాడని తెలిపారు. 

శ్రీకరభాష్యం ప్రచురిస్తూ శ్రీ పండిత చిదిరేమఠం వీరభద్రశర్మ గారు శ్రీపతి పండితుడు 1072 ప్రాంతపు వాడని బెజవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంలోని శిలాశాసనం ఆధారంగా ప్రకటించారు.

తెనాలి సాధనా గ్రంధ మండలి వారు 1960 ప్రాంతంలో ప్రచురించిన సిద్దాంతశిఖామణిలో (తెలుగు అనువాదం) ప్రచురించిన శ్రీ పండిత కాశీనాథుని మున్నుడిలో క్రీ.శ.1061 ప్రాంతంలోని పలు గ్రంధాలలో (శ్రీకరభాష్యం సహా) సిద్దాంతశిఖామణి ప్రస్తావించబడిందని రాయబడింది.  

శ్రీశైల సూర్యసింహాసన మఠం వారు (పంచాచార్య జగద్గురు పీఠం)  ప్రచురించిన సిద్దాంతశిఖామని (తెలుగులో మూల శ్లోకాలు ప్రచురించారు) లో శ్రీపతి పండితుడు క్రీ.శ. 1000 ప్రాంతం వాడని తెలిపారు. 

సిద్దాంత శిఖామణి గ్రంధకాలం ఏదైనా ఈ గ్రంధం పండితులందరిచేత పరమోత్తమమైన జ్ఞానగ్రంధంగా కొనియాడబడింది. రచయిత శివయోగి శివాచార్యులు తన తండ్రి సిద్దనాథుడని, తాత ముద్దదేవుడని, తాత తండ్రిగారు శివయోగి అని తెలుపుట జరిగింది, కాని జన్మ ప్రదేశం గూర్చి తెలుపలేదు. చరిత్రకారులు కూడా వెలుగుపరచలేక పోయారు - నిజానికి ఈ విషయంలో కృషి చేసినవారు ఉన్నట్టు కూడా తెలియటం లేదు. కాగా  కొందరు వీరు కొలనుపాకకు చెందినవాడే  అని విశ్వసిస్తారు. 

కొలనుపాకలో అన్ని కులాల వారికీ రేణుకుల వారు మఠాలు కట్టించి దీక్షా సంస్కారాలు ఇవ్వటం జరిగింది. అవి నేడు చాలా వరకు కనుమరుగైపోగా కొన్ని మఠాలు మాత్రం శిథిలావస్థలో ఉన్నవి. వాటి వివరాలు శ్రీశైల జగద్గురు వాగీశ పండితారాధ్య మహాస్వాముల వారి "వీరశైవము" (1966) నుండి - పేజీ-8:
1. పెద్ద మఠము 2. కురుమ మఠము 3. కాపు మఠము 4. కోమటి మఠము 5. గౌండ్ల మఠము 6. చాకలి మఠము 7. మంగలి మఠము 8. పద్మశాలి మఠము 9. మేదరి మఠము 10. పెరుక మఠము 11. మాల మఠము 12. మీమ్మాఱు మఠము (వడ్రంగి, కంచరి, కమ్మరి, శిల్పి) 13. గొల్ల మఠము 14. ఒడ్డెర మఠము  (దీనిని నక్క రామేశుని గుడి అనీ అంటారు) 15. సంగరి మఠము 16. తెనుగు మఠము 17. మేరె మఠము 18. గాండ్ల మఠము. 

సోమేశ్వర క్షేత్ర ఆలయ ఆవరణలో  కాకతీయ రుద్రమదేవి శిలా విగ్రహం ఉందని, ఇక్కడ రేణుకుల సంస్కరణల ప్రభావం నేటికీ ఉందని, అన్ని కులాలవారు పుట్టినపుడే లింగాలు ధరిస్తారని, ఈ ఊరిలో లింగవంతులైన మాలవాండ్లు మిగతా గ్రామాలలో మాదిరి ఊరి వెలుపల కాక ఊరు మధ్యలోనే నివసిస్తున్నారని శ్రీ ఉజ్జయిని జగద్గురువులు శ్రీ తరుళబాళు శివకుమార ఆచార్యులు తమ 1-జనవరి-1962 నాటి కొలనుపాక క్షేత్ర పర్యటన వివవరాలను 19-4-1963 (సంచిక-37) నాటి నవసందేశ కన్నడ పత్రికలో వివరించారు. 

చారిత్రకంగానే కాక సంస్కరణల పరంగానూ ఈ కొలనుపాక తన ఔన్నత్యాన్ని చాటుకుంది. కొలనుపాకతో (కొల్యపాక) బాటు తెలంగాణా ప్రాంతంలోని పఠాంచెరువు (పొట్లచెఱువు), జోగిపేటలు ఆనాడు జైనులకు, వీరశైవులకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నట్లు చారిత్రిక ఆధారాలవలన తెలుస్తుంది. ఇప్పటికీ కొన్ని శిథిలాలు, శాసనాలు పఠాంచెరువులో రోడ్లప్రక్కనే పడిపోయి కనిపిస్తాయి. ఆనాటి ఆనవాళ్ళను, విశేషాలను పదిలపరచటం ముందు తరాలకు అందజేయటం మన కర్తవ్యమ్.   

నల్లగొండ జిల్లాలోని కొలనుపాక ఒక్క వీరశైవమతస్థులకే కాక జైనులకూ, వైష్ణవులకూ కూడా ఎంతో ప్రసిద్దమైన స్థలం. ఇది చారిత్రకంగా ఎంతో ప్రసిద్ది నొందిన అతి పురాతన నగరం. ఇక్కడి నారాయాణస్వామి మందిరం కూడా అతి పురాతనమైనది. అలాగే జైన ఆలయం కూడా అతి పురాతనమైనదే. ఈ జైన ఆలయంలోని విగ్రహం అతి విలువైన రాతితో దాదాపు 35 అడుగుల ఎత్తున ఉండటం విశేషం. 

ఇక్కడ కనిపించే ఎన్నో శాసనాలు ఒకానొక కాలంలో కొలనుపాక ఎంతో ప్రసిద్ది చెందిన నగరమని తెలియపరుస్తాయి. పరిరక్షించే నాథుడు లేక ఎన్నో శాసనాలు, అక్కడి విగ్రహాలు చాలా భిన్నమైపోయాయి. సోమేశ్వర గుడి కూడా ఇప్పటికీ దీనావస్థలోనే ఉండడం భాద కలిగించే విషయం. ఇదే కాక ఇక్కడి గుళ్ళు, మఠాలు కూడా జీర్ణావస్థలోకి చేరు కున్నాయి. 
నిజానికి ఎంతోమంది వీరశైవం జన్మస్థానం కర్ణాటక అని భ్రమపడతారు - అది శుద్ధ తప్పు. మొదటగా తెలంగాణా లో పుట్టి తెలుగు దేశంలో ప్రాచుర్యం పొంది ఆ పైన భారతదేశంలోని మిగతా ప్రాంతాలకు ప్రాకింది అని చరిత్రను పరిశోధిస్తే తెలుస్తుంది. ఈ విషయమై ఎక్కువగా పరిశోధన సాగించిన వారూ లేరు. పంపన తెలుగు వాడే అయినా కర్ణాటకలో ప్రాభవం పొంది ఆదికవి స్థానం పొందినట్టు వీరశైవం కూడా ప్రాచుర్యం పొందింది. కర్ణాటకాది ప్రాంతాల్లో వీరశైవం ఆనవాళ్లు క్రీ. శ. 1000 తరువాతనే కనిపిస్తాయి. బసవేశ్వరాది ప్రముఖులు వీరశైవాన్ని బాగా ప్రాచుర్యంలోకి తేవటం జరిగింది. ఎంతోమంది శివశరణులు బయల్పడి అక్కడ వీరశైవాన్ని ఉన్నత స్థానంలోకి తీసుకు వెళ్ళటం జరిగింది. అయితే అంతలా కాకపోయినా తెలుగునాట కూడా ఎంతోమంది రచయితలు మరియు స్వాములు కూడా ప్రముఖంగా వీరశైవమును ఉన్నతస్థితికి తీసుకు వెళ్ళటం జరిగింది. పంపన (కొందరు తరువాత జైనుడు అంటారు), నన్నేచోడుడు,  పాల్కురికి సోమనాథుడు, పిడపర్తి సోమన, పోతన, మల్లికార్జున పండితుడు... చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వీరశైవ కవులు తెలుగులోనే అధికంగా కనిపిస్తారు. తెలుగులో ప్రత్యేకంగా శివకవులు గా కూడా గుర్తింపు పొందారు. చాలా మందికి తెలియని వ్యక్తులు, ప్రాచుర్యంలోకి రాని గ్రంథకర్తలూ, గ్రంధాలూ నేటికీ ఉన్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. నిదానంగానైనా ఈ విషయాలు తరువాత వెలుగులోకి రాగలవు. 

Birth Place of Veerashaivam - Kolanupaka - 1

వీరశైవం మూలస్థానం కొలనుపాక - 1

  భారతావనిలో వైదికమతం వెనుకంజ వేసిన తరుణంలో ఆయా కాలాల్లో ఎందఱో మహాత్ములు జనించి, సనాతన భారతీయ ధర్మాన్ని సందర్భాన్ని బట్టి నూతన పంథాలో పునరుద్దరించి ప్రజలని జాగృతపరచటం జరిగింది - నిజానికి ఆయా మతాల పరమోద్దేశం అదే. ఆది శంకరులు కేరళలో జన్మించి, అవైదికమతాలను ఖండించి, అద్వైతమత సిద్దాంతాన్ని ప్రతిపాదించి - పంచాయతన పూజను ప్రవేశ పెట్టి వైదిక ధర్మాన్ని పునరుద్దరించడం జరిగింది. తరువాత ఎంతోమంది మహాపురుషులు ఈ భారతావనిపై ఆయా కాలాల్లో అవతరించి తమ ప్రభోదాలతో ప్రజలను సన్మార్గ పంథాలో తీసుకువెళ్లటం జరిగింది.  

ఆ కోవలోనే  రేణుకాచార్యులు వారు నేటి తెలంగాణాలోని నల్గొండ జిల్లా కొలనుపాకలో ఉద్భవించి శక్తివిశిష్టాద్వైతాన్ని ప్రభోదించడం జరిగింది. ఈ  శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్నే వీరశైవంగా పిలుస్తారు. వీరశైవ మతానికి సంబంధించి మూలమైన అయిదుగురు పంచాచార్యులలో ఈ రేణుకులు ప్రథములు. 

మిగతా పీఠాలు:- 
ఉజ్జయిని-మరుళారాధ్య
కేదారనాథ్-ఎకోరామారాధ్య
శ్రీశైల-పండితారాధ్య
కాశీ-విశ్వారాధ్యులు

వీరి గురించి ఆగమాల్లో చాలా చోట్ల ప్రస్తావించబడింది. ప్రధానంగా స్వయంభువాగమ, వీరాగమ, సుప్రభేదాగమాల్లో వివరించబడి ఉంది. ఈ పీఠమూల పరంపర ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ పీఠాదిపాతులను జగద్గురువులుగా సంబోదిస్తారు. 

కాగా పస్తుతం రేణుకాచార్య పీఠం శాఖ వారు మాత్రం కొలనుపాకలో కాక కర్ణాటకలోని బాలేహోన్నూరులో కొనసాగాబడుతుంది. 

కాశీలో ఉన్న మఠాల అన్నిటిలోకి అతిపెద్దది, అతిపురాతనమైనదీ కాశీ జంగమవాడి మఠం. మొఘల్ సామ్రాజ్య కాలంలో కూడా ఈ మఠానికి విశిష్టస్థానం లబించటం, అక్భర్, షాజహాన్ ఆదిగాగల మొఘల్ రాజులందరూ ఎన్నో దానాలను ఈ మఠానికి సమర్పించారు. ఇట్టి విశేషమైన మఠానికి తరువాతికాలంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన చిదేరేమఠం వీరభద్రశర్మ గారు (తెలంగాణలో విభూతి పత్రికను నడిపారు) మఠాధిపతిగా విరాజిల్లటం జరిగింది.  

రేణుకాచార్యుడు ఉపదేశించిన శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని,   శివయోగి శివాచార్యులు క్రీ.శ.900 ప్రాంతంలో "సిద్దాంత శిఖామణి" పేరిట సంస్కృత భాషలో గ్రంధస్తం చేయటం జరిగింది. ఈ గ్రంధం అప్పటికే వీరాగమాది 28 గ్రంధాల్లో ఉన్న వీరశైవ తత్వాన్ని సంగ్రహించి రాయటం జరిగింది. సిద్దాంత శిఖామణి, సిద్దంతాలకన్నిటికీ తలమానికమై శిరోరత్నమువలె భాసిల్లటం జరుతుగుతుంది. ఈ శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని రేణుకాచార్యుడు భోదించటం వలన దీనిని "రేణుకాగీత" అనికూడా పిలవబడుతుంది. 


ఈ గ్రంధమే సమస్త వీరశైవులకు ప్రామాణిక గ్రంథము. ఈ సిద్దాంత శిఖామణి గూర్చి తరువాత పలు గ్రంధాలలో ప్రస్తుతించటం జరిగింది. బ్రహ్మసూత్రములకు  భాష్యము - శ్రీకరభాష్యం వ్రాసిన  శ్రీపతి పండితాచార్యుడు తన గ్రంధమున సిద్దాంతశిఖామణి నుండి కొన్ని ప్రమాణములను పేర్కోన్నాడు. వీరు  క్రీ.శ. 960 ప్రాంతమునకు  చెందినవాడు. 
వీరు సిద్దాంతశిఖామణిని   ప్రస్తావించుటన అతనికి పూర్వమే ఈ గ్రంధము వెలువడినదని చెప్పవచ్చు. 

శ్రీపత్ పండితుడు తన శ్రీకర భాష్యమున "పత్యుర సామంజస్యాత్" అను బ్రహ్మసూత్ర భాష్యమున సిద్దాంత శిఖామణి 5 వ పరిచ్చేదము లోని "అగస్త్యముని శార్దూల... " ఆదిగా గల 8 శ్లోకాలనూ ఉదాహరించటం జరిగింది.

అలాగే "అథాతోబ్రహ్మ జిజ్ఞాసా" అను బ్రహ్మ సూత్ర భాష్యమున కూడా:
"పవిత్రంతే" - ఋగ్వేద మంత్రస్య సిద్దాంత శిఖామణి శ్రీ రేణుకాచార్యేన లింగాధారణ పర్వతేన నిర్దేశిత్ అని
"రేణుక భగవత్పాద చార్యేణాపి" - పిండతాపిండ విజ్ఞాన మిత్యారభ్యవితాని  శివ భక్తస్య కర్తవ్యాని ప్రయత్నతః "ఇత్యంతేన సిద్దాంత శిఖామణౌ తస్యే ఉపదేశితే" అని వివరించి సిద్దాంత శిఖామణి గ్రంథ ఔన్నత్యాన్ని కొనియాడాడు. 
  
అంతేగాక  శ్రీకంఠ శివాచార్యులు కూడా తమ బ్రహ్మసూత్ర భాష్యం శ్రీకంఠ భాష్యములో  సిద్దాంత శిఖామణి శ్లోకములను  ప్రమాణ యుక్తముగా ఉదాహరించుట జరిగింది. 

శ్రీకంఠ శివాచార్యులు తన శ్రీకంఠ భాష్యమున "అవిభాగేన ద్రుష్టత్వాత్ " అను బ్రహ్మ సూత్ర భాష్యమున:
సిద్దాంత శిఖామణి 9 వ పరిచ్చేదమందలి14 వ శ్లోకము "ప్రసన్నే సతి ముక్తఃస్యాన్ ముక్త శివ సమొభవేత్" అను శ్లోకమును ప్రమాణ పూర్వకంగా ఉదాహరించుట జరిగింది.


ఇంకనూ ప్రసిద్ద సిద్దాంత కౌముది కర్త భట్టోజీ దీక్షితుల "తంత్రాదికార నిర్ణయము" లోనూ, కమలాకరభట్టు రచించిన "నిర్ణయ సింధు" లోనూ, మరియూ "శారదా తిలక" ,  "నిర్మాల్య రత్నాకరము", "శైవ బ్రాహ్మనోత్పత్తి" మొదలుగాగల గ్రంధములలో సిద్దాంతశిఖామణి ప్రమాణముల ఉదాహరించుట జరిగింది. 

అలాగే రేణుకాచార్యులు అప్పటికీ వైదికమతాన్ని, ఆచారాలను త్రోసిపుచ్చుతూ బహుళ ప్రాచుర్యతకు నోచుకుంటున్న బౌద్ద, జైన, చార్వాకాది మతాలను నిలువరింపజేసే క్రమంలో వీరశైవ మతాన్ని అందరూ ఆదరించే విధంగా తీర్చిదిద్దటం జరిగింది. అవైదిక మతాలకు ఆకర్షింపబడుతున్న హిందూదేశపు అంత్యకులాలవారిని అక్కున జేర్చుకోవటం జరిగింది. సంఘ సంస్కరణలో భాగంగా కొలనుపాకలో అన్ని కులాలవారికీ వీరశైవ దీక్షలు ఇవ్వటమే కాక ప్రతి కులానికీ ఒక మఠాన్ని స్థాపించటం జరిగింది. ఇప్పటికీ అక్కడ పాడుబడిపోయిన ఆనాటి కులాల వారీ మఠాలు నేటికీ కనిపిస్తాయి. ఆ తరువాత రేణుకాచార్యులు భారతదేశం అంతటా పర్యటించి అవైదిక మతాలను ఖండిస్తూ వీరశైవ మతాన్ని ప్రాచుర్యంలోకి తేవటం జరిగింది. 

Sunday, June 26, 2016

Literature

నిజానికి వీరశైవము గూర్చి పూర్వకాలంలో తెలుగులోనే ఎక్కువగా గ్రంధాలు వెలువడ్డాయి. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, శివతత్వసారమ్ ఆదిగా ఎన్నో కలవు. ఆధునిక కాలంలో ఐతిహాసిక సామ్రాట్ శివశ్రీ బండారు తమ్మయ్య గారు (ఆంధ్ర సారస్వత పరిషత్ అద్యక్షులు) వీరశైవ సాహిత్యానికి చేసిన సేవ చిరస్మరణీయం (వివిధ పత్రికల్లో లెక్కలేనన్ని వ్యాసాలు రాశారు, పలు గ్రంధాలు ప్రచురించి వీరశైవ తెలుగు సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చారు). అలాగే పండిత శ్రీ చిదిరేమఠం వీరభద్ర శర్మ గారు (పిదప్ కాశీ జ్ఞాన సింహాసనాన్ని అధిష్టించి జగద్గురువులైనారు) విభూతి మాస పత్రికను 1939 లో స్థాపించి వీరశైవ వెలుగులు ప్రసరింప జేశారు, పలు గ్రంధాలు ప్రచురించారు, అంతే గాక వీరశైవాన్ని తూలనాడే పలువురు పండితులతో ఎన్నో వాదనలు జరిపి విజయాలు సాధించి వీరశైవ జగతిలో విశిష్టతను పొందారు. శ్రీశైల సూర్య సింహాసనాదీశ్వరులైన శ్రీ వాగీశ పండిత శివాచార్యులు కూడా పండితులు, కవి, విద్వాంసులు అగుటచేత ఎన్నో వీరశైవ గ్రంధాలను ప్రచురించి వెలుగులోకి తెచ్చారు. శ్రీ నిడుదవోలు వెంకటరావు గారు వీరశైవ సాహిత్యానికి ఎంతో గొప్ప సేవ చేశారు-వారి సేవ అనన్యం. శివశ్రీ  ధూపం బసవనాగయ్య గారు వీరశైవ సాహిత్యానికి చేసిన సేవ చిరస్మరణీయం. శివశ్రీ Dr. K.M. రుద్రప్ప గారు ఎన్నో గ్రంధాలను ప్రచురించి వీరశైవ సాహిత్యంలో ఒక  ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు. శివశ్రీ పండిత పెద్దమఠం రాచవీరదేవర గారు కూడా వీరశైవ సాహిత్య వికాసానికే తమ ఆస్తినంతా ధారపోసి ధన్యులైనారు. మరెందరెందరో వీరశైవ సాహిత్య వికాసానికి వేశేష కృషి సల్పారు (వారందరి గురించి ముందు ముందు ప్రత్యేకంగా వివరించగలను).

ప్రస్తుత కాలంలో ఎందరో వీరశైవ సాహిత్యాన్ని వెలుగులోకి తేవడానికి ఎన్నో విధాల కృషి చేస్తున్నారు, అయినా వెలుగు చూసింది చాలా తక్కువే అని చెప్పాలి. శ్రీ కాశీ జ్ఞాన సింహాసనాధీశ్వరులైన జగద్గురు Dr.చంద్రశేఖర శివాచార్యుల వారు వీరశైవ వికాసానికి చేస్తున్న అపార కృషి అనన్యం. స్వయంగా పండితులగుట చేతనూ, సాహిత్యాభిలాషులగుట చేతనూ ఎన్నో గ్రంధాలను వెలుగులోకి తేవడమే కాకుండా పండితులకు పామరులకు కూడా ఉపయోగపడేలా చేస్తున్నారు. వీరు సాగిస్తున్న వీరశైవ మతోద్దరణ వేశేష శ్లాఘనీయం. భారతదేశమంతటనే గాక పరాయి దేశాల్లోనూ వీరు వీరశైవ మతానికి విశిష్టతను తెస్తున్నారు. మారుతున్న కాలానికనుగుణముగా వెబ్ ప్రపంచంలోనూ వీరశైవాన్ని చాటి చెబుతున్నారు. వీరి మూలకంగానే పరాయి దేశస్థులు కూడా వీరశైవ మతమును స్వీకరించి ఒక website కూడా ఉంచడం విశేషమే (http://veerashaiva.ru).